కేసీఆర్ సర్కార్ ను సాగనంపాలని కేంద్ర హోంమంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం బహిరంగ సభ వేదికగా పిలుపునిచ్చారు. రైతు గోస.. బీజేపీ భరోసా పేరుతో నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు.
కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్.. ఓవైసీతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని అవమానించారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అవినీతిని కొనసాగించాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని ఆరోపించారు. భద్రాచలం భక్తులను మనోభావాలను కేసీఆర్ దెబ్బతీస్తున్నారన్నారు.
బీజేపీ వ్యతిరేక పార్టీలపై అమిత్ షా సైటెర్లు వేశారు. కాంగ్రెస్ ను 4జీ పార్టీగా పేర్కొన్నారు. 4జీ అంటే నాలుగు తరాల పార్టీని తెలిపారు. ఎంఐఎం 3జీ పార్టీ , బీఆర్ఎస్ 2జీ పార్టీ అంటే రెండు జనరేషన్ల పార్టీ అని వివరించారు. 2జీ, 3జీ, 4జీ పార్టీలకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకే అధికారం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కమలం వికసిస్తుందని ధీమాగా చెప్పారు.
రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తోందని విమర్శలు చేసిన అమిత్ షా .. కేంద్రం వ్యవసాయ రంగం కోసం ఏం చేసిందో వివరించారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ రాజకీయం చేస్తోందని తప్పుపట్టారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. యూపీఏ హయాంలో రైతుల కోసం రూ. 22 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. మోదీ ఆ బడ్జెట్ ను రూ. లక్షా 25 వేల కోట్లకు పెంచారని తెలిపారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరను మోదీ సర్కార్ 66 శాతం పెంచిందని చెప్పుకొచ్చారు.
ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయని చేవెళ్ల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. ఓవైసీతో కలిసి ఉన్న కేసీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని తేల్చిచెప్పారు. ఉమ్మడి ఏపీకి ఏమిచ్చారో ఖర్గే చెప్పాలని కోరారు. 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ. 2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని వివరించారు. ఇలా తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లక్ష్యంగా అమిత్ షా ప్రసంగం సాగింది. బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేశారు.