Amit Shah : తెలంగాణలో రాజకీయ సమరానికి మరో ఐదురోజులే సమయం ఉంది. ప్రచారానికి ఇంకో మూడురోజుల్లో తెరపడనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార జోరును పెంచాయి. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన హోం మంత్రి అమిత్ షా.. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రైతులు, పేదలు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. కేజీ టు పీజీ విద్య హామీని పూర్తిగా గాలికి వదిలేశారని, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని విమర్శించారు. రైతులకు లక్షరూపాయల రుణ మాఫీ లేదన్నారు. అలాగే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ సర్కార్.. ఎన్ని ఉద్యోగ ఖాళాలను భర్తీ చేసిందో చెప్పాలన్నారు.
మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం కేసీఆర్ సర్కారేనని ఎద్దేవా చేశారు. అమీర్ పేట భూముల్లో స్కామ్ జరిగిందన్న అమిత్ షా.. మిషన్ కాకతీయ పేరుతో వేలకోట్లను దండుకున్నారన్నారు. గ్రానైట్ కుంభకోణంలో కోట్లాది రూపాయల మనీలాండరింగ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ కుంభకోణాలు తప్ప చేసిందేమీ లేదని అమిత్ షా తెలిపారు. కేసీఆర్ సహకరించకపోయినా.. కేంద్రం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణకు ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయని, ఈసారి ప్రజలు సర్కారు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసిందని, అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తామన్నారు.