Ambedkar Statue : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మారకం ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్సాగర్ తీరంలో ఈ భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరుకానున్నారు.
బాబాసాహెబ్ జయంతి వేళ 125 అడుగుల లోహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసింది. పీఠం లోపల అంబేడ్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలతో ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
2016 ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పాటు చేశారు. 2018 ఏప్రిల్ 4న డీపీఆర్ రూపొందించడానికి, కన్సల్టెన్సీ సేవల కోసం డిజైన్ అసోసియేట్స్ను నియమించారు. కన్సల్టెన్సీ వృత్తాకార, చతురస్రాకార స్తూపాల డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్ వృత్తాకార నమూనాకు ఆమోదం తెలిపారు. పార్లమెంట్ భవనం నమూనాలో సిద్ధం చేయాలని సూచించారు.
ఢిల్లీలోని రాంసుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మత్తురామ్ ఆర్ట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్లకు చెందిన శిల్పుల పర్యవేక్షణలో డీపీఆర్ సిద్ధమైంది. 2020 సెప్టెంబర్ 16న రూ.146.50 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. టెండర్లు పిలిచి కేపీసీ ప్రాజెక్ట్సు లిమిటెడ్కు పనులను అప్పగించారు. 2021 జూన్ 6న ఒప్పందం చేసుకుని 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని షరతు విధించారు. ఇప్పుడు పనులు పూర్తికావడంతో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది.