Amabati Rambabu : నాగార్జున సాగర్ డ్యామ్ పై జరుగుతున్న పరిణామాలపై తప్పుడు రాతలు రాస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించవద్దని కొన్ని మీడియా సంస్థలకు సూచించారు. సాగర్ విషయంలో రాజకీయాలను ముడిపెట్టడం తగదన్నారు. తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటామని అంబటి చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ లేదన్నారు అక్కడ పోటీ చేయని విషయాన్ని ప్రస్తావించారు. అలాంటప్పుడు ఏ పార్టీని ఓడించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. సాగర్ లో ఏపీ వాటాకు మించి ఒక్క నీటి బొట్టును వాడుకోమన్నారు.
సాగర్ డ్యామ్ పై పోలీసుల సహకారంతో 13 గేట్ లను స్వాధీనం చేసుకున్నామని అంబటి వివరించారు. రాష్ట్రంతోపాటు ప్రాజెక్టులు విడిపోయాయని తెలిపారు. కృష్ణ రివర్ బోర్డు తామే నిర్వహిస్తామని చెప్పారు. ప్రాజెక్టు వివరాలపై అంబటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం అసమర్థ వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును అధీనంలో ఉంచుకుందన్నారు.చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తా అన్నప్పుడు కూడా అడ్డుకున్నారని గుర్తు చేశారు. అప్పుడు గవర్నర్ సమక్షంలో పంచాయితీ జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులో 66 శాతం నీటిని వినియోగిస్తామని వివరించారు. ఓటుకి నోటు వల్ల చంద్రబాబు ఏపీ హక్కులు వారికి ఇచ్చారని విమర్శించారు.
సాగర్ కుడికాలువను తెలంగాణ నుంచి ఆపరేట్ చేస్తున్నారని అంబటి చెప్పారు. ఏపీ వాటాను విడుదల చేసుకునే స్వేచ్ఛ కావాలని స్పష్టం చేశారు. తమ హక్కుల జోలికి మీరు రావద్దని సూచించారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. గొడవలు అక్కర్లేదన్నారు. ఇప్పటికైనా తమ హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశామని చెప్పారు.
మరోవైపు ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, అనుమతిలేకుండా డ్యామ్ పైకి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ పోలీసులతోపాటు ఇరిగేషన్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. వారిపై తెలంగా ఎస్పీఎఫ్ పోలీసులు ఈ ఫిర్యాదు చేశారు.