Amararaja : అమరరాజా గ్రూపునకు చెందిన అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో అమరరాజా సంస్థ హైదరాబాద్లో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఐటీ మంత్రి కేటీఆర్, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్, ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమరరాజా సంస్థ 37 ఏళ్లుగా సేవలందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా ముందుకొచ్చిందని తెలిపారు. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో తమను కోరిందని గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ సంస్థ పెట్టుబడులన్నీ ఏపీకే పరిమితమయ్యాయని తెలిపారు. పలు కారణాల వల్ల తెలంగాణలో కార్యకలాపాలు మొదలుపెట్టలేకపోయామన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావించామని చెప్పారు.
భారత్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీపై కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నామని గల్లా జయదేవ్ వివరించారు. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు సరైన ప్రాంతం కోసం చూశామన్నారు. తెలంగాణలో ఈవీ వాహనాల రంగం పుంజుకుంటోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయన్నారు. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని గల్లా జయదేవ్ అన్నారు.