Ayodhya : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ శుభవార్త. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి చూపూ ఇప్పుడు అయోధ్యవైపే ఉన్నాయి. కానీ ఎలా వెళ్లాలనేదే అందరి ప్రశ్న. అయోధ్య రామమందిరం దర్శనానికి అనుమతించడంతో భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇలా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే జనవరి 29 నుండి ఫిబ్రవరి 29 మధ్య దక్షిణాది రాష్ట్రాల నుండి ఆలయ పట్టణానికి 41 రైళ్లను నడుపుతుంది. మొత్తం 41 రైళ్లలో సికింద్రాబాద్ నుంచి 17, కాజీపేట నుంచి 15, గుంటూరు నుంచి 1, విజయవాడ నుంచి 1, రాజమండ్రి నుంచి 1, సామర్లకోట నుంచి 1, విశాఖపట్నం నుంచి 4, విజయనగరం నుంచి 1 రైలు నడపాలని భారతీయ రైల్వే ఏర్పాట్లు చేసింది.
జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ రైళ్లున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లే కాకుండా ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు ఒక ఎక్స్ప్రెస్ రైలు నడుస్తోంది. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ రైలులో టిక్కెట్లు దొరకడం సమస్యగా మారింది. అందుకే ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలు హైదరాబాద్ నగరంలో ఉదయం 10.40 గంటలకు బయలుదేరి నేరుగా అయోధ్యకు మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.
యాత్రల నిర్వహణలో బీజేపీ అనుబంధ సంస్థలు..
అయోధ్య యాత్రలు నిర్వహించేందుకు బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంస్థలు ఏబీవీపీ, వివిధ మోర్చాలు, బీజేవైఎంతో పాటు వీహెచ్పీ, భజరంగ్దళ్ సిద్ధమయ్యాయి. రైలులో రామభక్తులను తీసుకెళ్లి అయోధ్య మందిర దర్శనం తర్వాత వారణాసి సందర్శన వరకూ బాధ్యతలను వహించనున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 200ల మంది యాత్రికులను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్కడ వసతి, భోజన సౌకర్యం కల్పించనుంది. ప్రతి రైలులో 1400ల మంది వరకూ వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. అయితే.. అయోధ్యకు నడిపే ప్రత్యేక రైళ్ల నంబర్లు ఇంకా తెలియాల్సి ఉంది. దీని విధి విధానాల రూపకల్పనలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. యాత్రల నిర్వహణను ఐఆర్సీటీసీ (IRCTC)కి అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు టిక్కెట్ ధర ఎంత వసూలు చేయాలనేది రైల్వే అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఐఆర్సీటీసీ ఇప్పటికే భారత్ గౌరవ్ యాత్రల పేరిట ప్రత్యేక రైళ్లను గతేడాది నడిపింది. గత ఏడాది అయోధ్యను కలుపుతూ వారణాసి నగరం నుంచి 14 ట్రిప్పులు నిర్వహించగా.. 7200ల మందిని తీసుకెళ్లినట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. మళ్లీ మార్చి నుంచి యాత్రలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.
అటువంటి టూర్ ప్యాకేజీలో, దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుండి ఉదయం 9.25 గంటలకు బయలుదేరి వారణాసి మీదుగా బీహార్లోని దానాపూర్ చేరుకుంటుంది. వారణాసిలో, కాశీ విశ్వనాథ మందిరం, కాలభైరవ, విశాలాక్షి, అన్నపూర్ణ, గంగాహారతి వంటి ప్రదేశాలు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ప్రయాణం బోధ్ గయా వరకు ఉంటుంది.
ఇక్కడ.. మంగళగురి శక్తిపీఠం, విష్ణుపాద మందిరాన్ని సందర్శించవచ్చు. మరుసటి రోజు రామమందిర సందర్శన కోసం అయోధ్యకు వెళ్తారు. మరుసటి రోజు అయోధ్య నుండి అలహాబాద్కు ఐదు గంటల ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఒకరు త్రివేణి సంగమం వద్ద ప్రార్థనలు చేయవచ్చు. హనుమాన్ మందిర్తో పాటు అలోపి దేవి శక్తిపీఠాన్ని సందర్శించవచ్చు. ఆ తర్వాత వారణాసికి తీసుకెళ్తారు.