Congress News Telangana: రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ కావడాన్ని చాలామంది నేతలు తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్లతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లూ కడుపుమంటతో రగిలిపోతున్నారని అంటున్నారు. అందులో అందరికంటే ముందుండేది, ఓపెన్ అయ్యేది ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డినే. ఆ తర్వాత తెరవెనుక కుట్రలు చేసే సీనియర్ల బ్యాచ్లో చాలామందే ఉంటారని చెబుతుంటారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆ యాంటీ బ్యాచ్లో యాక్టివ్ లీడర్స్ అంటారు. ఇక, భట్టి మాత్రం చిక్కడు దొరకడు టైప్. ఉత్తమ్ ఎక్కడా బయటపడకున్నా.. ఏలేటి మాత్రం రేవంత్కు వ్యతిరేకంగా బాగానే హడావుడి చేస్తుంటారు. ఈయన ఆయన మనిషే. అలాంటి మహేశ్వర్రెడ్డికి షోకాజ్ నోటీసులు రావడం.. వివరణకు గంట సమయం మాత్రమే ఇవ్వడం.. కాంగ్రెస్లో కలకలం రేపింది. ఇక తాను పార్టీలో ఉండలేనని, రేవంత్తో నెగ్గలేనని.. ఏలేటి తన దారి తాను చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో పాదయాత్రను మొదట పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తాను మాత్రమే చేయాలని భావించారు. కానీ, మహేశ్వర్రెడ్డి అడ్డుపడటంతో పార్టీ లీడర్లంతా యాత్ర చేయొచ్చని ఇంఛార్జ్ థాక్రే ప్రకటించాల్సి వచ్చింది. ఇక, ఏలేటి సైతం నిర్మల్ టు హైదరాబాద్ అంటూ ఆర్భాటంగా పాదయాత్ర ప్రారంభించారు. కానీ, ఏం జరిగిందో ఏమో కొన్నిరోజులకే దుకాణం మూసేశారు. థాక్రేనే తన యాత్రను ఆపేలా ఒత్తిడి చేశారని.. దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనేది మహేశ్వర్రెడ్డి ఆరోపణ. ముందుగా పాదయాత్రకు అనుమతి ఇచ్చిన థాక్రేనే.. మళ్లీ ఎందుకు మానేయమంటారు? ఏలేటి ఆరోపణలో నిజమెంత? అనేది కాంగ్రెస్ శ్రేణుల డౌట్.
ఇలా కాంగ్రెస్లో ఆధిపత్య పోరు నడుస్తుండగా.. వన్ ఫైన్ డే ఏలేటి మహేశ్వర్రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ఏఐసీసీ నేత అయిన తనకు పీసీసీ షోకాజ్ ఇవ్వడమేంటని ఏలేటి సీరియస్ అవుతున్నారు. తన మీద పగ పట్టిండ్రని.. తనను పార్టీ నుండి పంపించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల్ని నేరుగా కలిసిన వారికి ఎలాంటి నోటీసులు ఉండవు కానీ.. తనపై ఎక్కడో ఏదో వార్త వస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తాను పార్టీ వీడాలంటే నిమిషం పట్టదంటూ వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. తనకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని.. అయినా తాను వెళ్లలేదంటున్న ఏలేటి.. లేటెస్ట్గా బీజేపీతో టచ్లోకి వెళ్లారని టాక్.
తాజాగా, తన ముఖ్య అనుచరులు, పార్టీ ప్రధాన కార్యకర్తలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు ఏలేటి మహేశ్వర్రెడ్డి. బీజేపీలో చేరడంపైనే ఆ భేటీలో చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉంది. ప్రజల్లో కాషాయ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, బలమైన నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్. ఏలేటి లాంటి వాళ్లు కాషాయ కండువా కప్పుకుంటే.. అది అటు బీజేపీకి, ఇటు ఆయనకు మరింత బలం. అనుచరులు సైతం బీజేపీలోకి వెళ్తేనే బాగుంటుందని బలంగా ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అన్నీకుదిరితే.. ఈనెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ సభరోజే హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వనున్నారట ఏలేటి మహేశ్వర్రెడ్డి. రేపోమాపో ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనకు బీజేపీతో పాటు బీఆర్ఎస్ నుంచీ ఆహ్వానం ఉందని.. కానీ పార్టీ మార్పుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం లేదని. మరోసారి అందరితో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి.