ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ నెలకొనగా.. మరోవైపు కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో అలంపూర్ లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తాకింది. అలంపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
బీఆర్ఎస్ తొలుత అలంపూర్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కేటాయించినప్పటికీ.. చివరికి బీఫామ్ మాత్రం చల్లా మనిషైన విజయుడికి ఇచ్చారు. దీంతో అబ్రహం మనస్తాపానికి గురయ్యారు. కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న అబ్రహం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. తనను నమ్ముకున్న కేడర్ కోసమే పార్టీ మారుతున్నట్లు అబ్రహం పేర్కొన్నారు.
ఇప్పటికే అలంపూర్ లో మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ లో చేరగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కూడా కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో అలంపూర్ లో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరనుంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అలంపూర్ లో అగ్రకులాల పెత్తనంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా పెత్తనాన్ని అడ్డుకునేందుకు అలంపూర్ అగ్రనేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు.
.
.