Telangana Elections : అందరికంటే ముందు కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు . అందరికంటే ముందే బీఫాంలు ఇచ్చారు. కానీ అందరినీ చూసినట్లు అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి అబ్రహంను ట్రీట్ చేయలేదు. లిస్టులో పేరు ప్రకటించి ఆశలు రేకెత్తించిన కేసీఆర్.. సరిగ్గా ఎన్నికలకు 20 రోజుల ముందు నట్టేట ముంచారన్న ఆవేదన అబ్రహం అనుచరుల్లో కనిపిస్తోంది. ఇదంతా చల్లా వెంకట్రామిరెడ్డి కనుసన్నల్లో జరిగిందన్న చర్చ అలంపూర్ లో జరుగుతోంది.
తెలంగాణలో ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.. నోటిఫికేషన్ కంటే ముందే బీంఫాలు ఇచ్చేసిన కేసీఆర్.. అలంపూర్ అభ్యర్థిని చాలా ఆవేదనకు గురి చేశారు. బీ ఫాం ఇవ్వకుండా ఆపేశారు. ఎలక్షన్లకు 20 రోజుల ముందు మరో అభ్యర్థి విజేయుడు కి బీఫాం ఇచ్చేశారు గులాబీ బాస్. తనకే బీ ఫాం వస్తుందని, కేసీఆర్ నే నమ్ముకున్నానని అబ్రహం ఇన్ని రోజులుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు సరైన గౌరవం కూడా దక్కకుండా పోయిందన్న ఆవేదన ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. బీ ఫాం ఇవ్వలేకపోతున్నాం.. అని పిలిచి మర్యాదగా ఎందుకు చెప్పలేకపోయారన్న ఆవేదన అబ్రహం వర్గంలో కనిపిస్తోంది.
అలంపూర్ లో అబ్రహంకు బీఆర్ఎస్ బీ ఫాం దక్కకపోవడం వెనుక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి ఎఫెక్ట్ ఉందంటున్నారు. గులాబీ పార్టీలో ఏడాది కిందటే చేరిన చల్లా.. ఇప్పుడు గద్వాల గులాబీ దళాన్ని మొత్తం తన చెప్పు చేతల్లోకి తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఆఖరకు గులాబీ బాస్ అయినా చల్లా మాట వినాల్సిందే అన్నంతగా పరిణామాలు మారిపోయాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్… అబ్రహంకు బీ ఫాం ఇస్తే తాను సహకరించబోనని, అభ్యర్థి ఓటమి కోసం పని చేస్తానని అధినేతకే వార్నింగ్ ఇచ్చే పొజిషన్ కు చేరుకున్నట్లు గులాబీ కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది. అబ్రహంతో చల్లాకు పొసగకపోవడం.. తాను అనుకున్నట్లు, తన మాట వినే అభ్యర్థినే బరిలో దింపాలనుకోవడంతో.. అబ్రహంను పార్టీలో అవమానకర రీతిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. చల్లా ఏం చెప్పినా కేసీఆర్ చేయాల్సిందే అన్నట్లుగా సీన్ మారిపోయిందంటున్నారు.
ఎప్పుడూ పదునైన ఆలోచన, పకడ్బందీ ప్రణాళికతో నిక్కచ్చిగా తన నిర్ణయాలను అమలుపరిచే కేసీఆర్.. అలంపూర్ సెగ్మెంట్ లో మొత్తానికే చేతులెత్తేశారా అన్న అనుమానాలు కలగకమానవు. అబ్రహంకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో అసమ్మతిని చల్లా వర్గం రాజేసిందంటున్నారు. అలంపూర్ ఎస్సీ రిజర్వుడు స్థానం. అక్కడ అభ్యర్థిని మార్చాలనుకుంటే పిలిచి చెప్పాల్సింది పోయి.. కనీసం అబ్రహం ఎదురు పడితే పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటన్న ప్రశ్నల్ని అబ్రహం అనుచరులు వినిపిస్తున్నారు. దళితులను ఇంతలా అవమానించాలా అని వాపోతున్నారు. పార్టీని నమ్ముకుని పని చేసినందుకు ఇదేనా ప్రతిఫలం అని బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తితో ఉంది.
బీఆర్ఎస్లో ఇది వరకే మాజీ ఎంపీ మందా జగన్నాథం, అబ్రహం వర్గాల మధ్య విభేదాలు ఉండగా.. ఏడాది క్రితం చల్లా రాకతో ముచ్చటగా మూడు వర్గాలయ్యాయి. ఆధిపత్య పోరులో అబ్రహంపై చల్లా పైచేయి సాధించారు. ఇప్పుడు అబ్రహం బీ ఫాంను కూడా లాగేసుకున్న పరిస్థితి. అది కూడా అధినేత కేసీఆర్ ను ఎదురించి మరీ చల్లా తన పంతం నెగ్గించుకున్నారంటున్నారు. బీఆర్ఎస్ లో చల్లా వెంకట్రామ్ రెడ్డి చేరక ముందే అబ్రహం పార్టీని బలోపేతం చేసి 2018 ఎన్నికల్లో స్వయంగా గెలిచారు. కానీ ఇప్పుడవన్నీ పక్కకు పోయాయి. కొత్తగా వచ్చిన చల్లా వెంకట్రామ్ రెడ్డికే ప్రాధాన్యత పెరిగింది. చల్లా తాను చెప్పినట్లు వినే అనుచరుడికే టిక్కెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
అలంపూర్ లో ఏకాభిప్రాయం కోసం బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నాలు చేసినా అబ్రహం వర్గం, మందా జగన్నాథం వర్గం, ఇటు చల్లా గ్రూప్ ఎవరికి వారు పట్టు వీడలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని అలంపూర్ టిక్కెట్ తన కొడుకు మందా శ్రీనాథ్ కు ఇవ్వాలంటూ జగన్నాథం పట్టుబట్టారు. అలంపూర్ సెగ్మెంట్ లో రగడ పెరగడంతో సీఎం కేసీఆర్.. అబ్రహంతో పాటు ఎమ్మెల్సీ చల్లా ప్రతిపాదించిన అభ్యర్థి విజయుడిపై ప్రత్యేకంగా సర్వే చేయించారు. ఆ సర్వే ఫలితాలు అబ్రహంకే అనుకూలంగా వచ్చినా సరే.. చల్లా ప్రతిపాదించిన వ్యక్తినే ఫైనలైజ్ చేయడం ఏంటన్న ఆవేదన అబ్రహం వర్గంలో ఉంది. ఈనెల 19న అలంపూర్ లో కేసీఆర్ ప్రచార సభ ఉంది. ఆ లోపు మందా, అబ్రహం, చల్లా వర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని కేటీఆర్ కు బాధ్యత అప్పగించినట్లు చెబుతున్నారు. బీ ఫాం రాని అబ్రహం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అటు తమ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న మందా జగన్నాథం కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
.
.