Samajwadi Party: రెండు తెలుగు రాష్ట్రాలలో గల ప్రధాన పార్టీలకు పోటీనిచ్చే విధంగా మరో పార్టీ అడుగుపెట్టబోతోంది. దీనితో ఇక ప్రధాన పార్టీలకే కాక, ఆ పార్టీల నాయకులకు కూడా మున్ముందు గట్టి పోటీని ఇచ్చే పార్టీగా సమాజ్ వాదీ పార్టీ రంగ ప్రవేశం చేయనుంది. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి చెందిన నాయకులు అందుకు తగ్గ ప్రణాళికలు రచించి.. పార్టీలో చేరికలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పార్టీ బలోపేతం అయితే.. మున్ముందు ప్రధాని పార్టీలకు మరో పార్టీ గట్టి పోటీ నివ్వనున్నట్లు భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అత్యధిక ఓటర్లు గల జాబితాలలో మొదటగా బీసీలే ఉంటారు. అందులో కూడా యాదవులు అత్యధికంగా ఉంటారు. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(SP)కి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాజకీయ వ్యూహాలు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకవైపు ఇండియా కూటమిలో ఉంటూనే అఖిలేష్ యాదవ్ తన పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కీలక ఓటు బ్యాంక్గా ఉన్న యాదవ్ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు.
Also Read: ‘గురి తప్పని విలుకాడు’ సీఎం రేవంత్..
ఇందులో భాగంగానే ఏపీ, తెలంగాణలో పలువురు నేతలను అఖిలేష్ యాదవ్ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఏపీలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా పాశం వెంకటేశ్ ఉన్నారు. ఇటు తెలంగాణలో సమాజ్ వాదీ పార్టీని నిత్య కళ్యాణ్ యాదవ్ ముందుండి నడిపిస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్కు వచ్చిన పాశం వెంకటేశ్ను నిత్య కళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు నర్సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని.. తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నిత్య కళ్యాణ్ యాదవ్.. వెంకటేశ్కు వివరించారు. దీంతో నిత్యకళ్యాణ్ను వెంకటేశ్ అభినందించారు.