AIMIM: బీఆర్ఎస్ తో కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్నారు. చాలా రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు. ఎర్రకోటపై గులాబీ జెండా పక్కాగా ఎగురుతుందని చెబుతున్నారు. బాహుబలిలా బలప్రదర్శన చేస్తున్న బీఆర్ఎస్.. కేవలం పాతబస్తీకే పరిమితమైన ఎమ్ఐఎమ్ ను లైట్ తీసుకుంటున్నట్టు ఉంది.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చాలా చీప్ గా మాట్లాడారని అంటున్నారు. కేవలం ఏడుగురు సభ్యులే ఉన్న పార్టీకి ఇంత సమయమా? అంటూ ఎద్దేవా చేయడం కలకలం రేపింది. కేటీఆర్ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ ఓవైసీ బాగా హర్ట్ అయినట్టున్నారు. కేవలం 7 సీట్లు మాత్రమే అంటారా.. వచ్చే ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేస్తామని అక్కడికక్కడే ప్రకటించేశారు ఓవైసీ. అసెంబ్లీలో కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా ప్రయత్నిస్తామని సవాల్ చేశారు. అక్బరుద్దీన్ ఛాలెంజ్ తో బీఆర్ఎస్ లో అప్పుడే కంగారు మొదలైపోయింది.
కేవలం సవాల్ కే పరిమితం అవలేదు అక్బరుద్దీన్. ఛాలెంజ్ ని సీరియస్ గానే తీసుకున్నట్టున్నారు. బీఆర్ఎస్ కు ఎలాగైనా ఝలక్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు. తాజాగా, మరిన్ని ముందడుగులు వేశారు. సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తి అయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డిలతో గంట పాటు మంతనాలు జరిపారు.
ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ నేతల భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఎంఐఎం కూడా సెక్యులర్ పార్టీ అయింది కాబట్టే తాము మాట్లాడాం.. అందులో తప్పేముంది అంటూ జగ్గారెడ్డి సమర్థించుకున్నారు. కానీ, అసలు సంగతి వేరే ఉందని అంటున్నారు. వారి మధ్య 50 స్థానాల్లో AIMIM పోటీ చేసే అంశంపైనే చర్చ జరిగిందని చెబుతున్నారు. ఈసారి ఎంఐఎం పార్టీ టిక్కెట్ పై హిందువులను కూడా నిలబెట్టనున్నట్టు తెలుస్తోంది. తమది పక్కా ముస్లీం పార్టీ కాదని.. సెక్యులర్ పార్టీ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది మజ్లిస్.
ఇక, బీఆర్ఎస్ నే టార్గెట్ గా చేసుకుంది ఎమ్ఐఎమ్. ఏయే 50 స్థానాల్లో పోటీ చేస్తే.. కారు గుర్తును దెబ్బ తీయొచ్చో అంచనాలు వేస్తోంది. అందుకు, కాంగ్రెస్ సహకారం కోరేందుకే వారితో ఓవైసీ చర్చలు జరిపారని తెలుస్తోంది. ఎక్కడ పోటీ చేస్తే హస్తం పార్టీ నుంచి మద్దతు వస్తుంది.. ఏయే స్థానాల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే లాభం జరుగుతుంది.. ఇలాంటి అంశాలపైనే వారి మధ్య టాక్స్ నడిచాయని అంటున్నారు.
గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అనుభవం కూడా ఉంది ఎమ్ఐఎమ్ కి. సీఎం కిరణ్ కుమార్ హయాంలో ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత తెలంగాణ వచ్చాక కేసీఆర్ తో లింక్ కుదిరింది. ఇప్పుడు ఎమ్ఐఎమ్ ను బీఆర్ఎస్ లైట్ తీసుకుంటుండటం.. అవమానించేలా కేటీఆర్ మాట్లాడటంతో.. రివేంజ్ కోసం మజ్లిస్ మంతనాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అవసరమైతే బీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పేసి.. కాంగ్రెస్ తో కలిసేందుకూ వెనకాడకపోవచ్చని అంటున్నారు. అయితే, తమ్ముడు అక్బరుద్దీన్ దూకుడుగా ఉన్నారు కానీ.. మరి, అన్న అసదుద్దీన్ ఏమంటారో?