Hanamkonda : చిన్న చిన్న విషయాలకు అతీగా ఆలోచించి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కని, పెంచిన తల్లిదండ్రులకు కడుపు శోకం మిగులుస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లా.. హసన్ పర్తిలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సంక్రాంతి సెలవులు కావడంతో అందరూ ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉండటంతో దీప్తి గదికి వెళ్లిన స్నేహితులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీప్తి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురుగా గుర్తించారు.
గురువారం రాత్రి కూడా దీప్తి మామూలుగానే మాట్లాడిందని తోటి విద్యార్థులు అంటున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. దీప్తి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు రాలేదు. డోర్ కొట్టిన తలుపు తీయలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా దీప్తి ఉరి వేసుకొని కనిపించింది. రాత్రి రూమ్ లో దీప్తి ఒంటరిగా ఉందని విద్యార్థినులు తెలిపారు. అర్ధరాత్రి ఉరి వేసుకొని ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసులు దీప్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి లాస్ట్ కాల్ ఎవరికి చేసింది? ఎవరితో అయినా చాటింగ్ చేసిందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.