Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. దానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వచ్చే నాలుగు నెలల్లో ఫ్యాక్టరీ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అలానే రాబోయే రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరొక పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. త్వరలో అశ్వరావుపేట హార్టికల్చర్ హబ్గా మారనుందని అన్నారు. వ్యవసాయ కళాశాలలో హార్టికల్చర్ ను ప్రధాన కోర్సుగా తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వక్క, కోకో, కొబ్బరి అంతర పంటలు సాగుచేయటం ద్వారా రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నారు.
తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా పామాయిల్ రైతుల కోసం కృషి చేశానని తుమ్మల అన్నారు. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, సిద్దిపేట, మహబూబాబాద్ లతో సహా ఐదు ప్రాంతాల్లో కొత్త పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మాణం అవుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పామాయిల్ ఫ్రూట్ దిగుమతి వచ్చేసరికి ఫ్యాక్టరీలు నిర్మాణం పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఏటా రెండున్నర కోట్ల రూపాయల కరెంటు వినియోగం అవుతుందని ఇది రైతులపై అదనపు భారం పడకుండా 30 కోట్ల నిధులతో బయో పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నామన్నారు. ఇదేవిధంగా పామాయిల్ క్రూడ్ తీసిన తర్వాత వ్యర్ధాల వినియోగంపై వచ్చే ఆదాయం కూడా రైతులకే అందే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.