Thummala Nageswara Rao : రైతులకు విత్తన సరఫరా, తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి పై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నత అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. వ్యవసాయ శాఖ, విత్తన ధ్రువీకరణ సంస్థ , విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వచ్చే సీజన్ లో రైతులకు విత్తన సరఫరాపై మంత్రి తుమ్మల అధికారుల సమీక్ష చేశారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న విత్తనాల సరఫరాపై చర్చించారు. అదేవిధంగా రైతులకు విత్తనాల విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విత్తన సరఫరా విషయంలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నకిలీ విత్తనాల సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశంచేశారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలే తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తుమ్మల తెలిపారు.