CM Revanth Reddy’s speech after inspecting the Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పరిశీలించిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ చార్జ్ సుధాకర్ రెడ్డి ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టు ఐదేళ్లలో 162 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. గత ఏడాది కేవలం 8టీఎంసీలే ఎత్తిపోశారన్నారు. ప్రతిపాదనలకు తగ్గట్టుగా నీటిని ఎత్తిపోయలేని దుస్థతిలో ప్రాజెక్టు ఉందన్నారు.
నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించినా .. కేసీఆర్ ప్రభుత్వం సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని అన్నారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25వేల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు.
కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్ కప్పిపుచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈసీ అనుమతి పొంది రాహుల్ గాంధీతో పాటు మేడిగడ్డను పరిశీలించామన్నారు. జరిగిన అవకతవకలపై నీటిపారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ చెప్పిందన్నారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్ గ్రహించారని పేర్కొన్నారు.
Read More: ఎంత నమ్మక ద్రోహం కేసీఆర్..!
అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో కేసీఆర్ సభ పెట్టారన్నారు. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ పదే పదే అంటున్నారన్నారు. అలా అన్నందుకే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని దుయ్యబట్టారు.
కాళేశ్వరంపై ప్రజల అనుమానాలు నివృత్తిచేయాలని ప్రభుత్వం భావించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసనసభ, ప్రజా కోర్టులో చర్చిద్దామని ఎమ్మెల్యేలందరిని ఆహ్వానించామన్నారు. కాలు విరిగిందని శాసనసభకు రాలేని కేసీఆర్.. నల్గొండ సభకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందన్నారు. అడిగితే సలహాలు ఇస్తానన్న కేసీఆర్ ..కేఆర్ఎంబీపై చర్చ పెడితే అసెంబ్లీకి ఎందుకు రాలేదని నిలదీశారు. సభలో చేసిన తీర్మానం చక్కగా లేదని విమర్శిస్తున్నారు. అలాంటి తీర్మానానికి హరీశ్రావు ఎందుకు మద్దతిచ్చారన్నారు. హరీష్ రావు మాటలకు విలువ లేదా? కేసీఆర్ బెదిరించి బతకాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ కు సీఎం కుర్చీ పోగానే.. నీళ్లు, ఫ్లోరైడ్ బాధితులు గుర్తొచ్చారా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాలు విరిగందని సాను భూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వచ్చేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏముంది చిన్న పిల్లర్లు కుంగాయని తేలికగా మాట్లాడుతున్నారన్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆరేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులను కేంద్రం నిర్వహించేందుకు గత ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చిందన్నారు. సాగునీటి శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం పెడతామన్నారు.. కేసీఆర్ వచ్చి మాట్లాడాలన్నారు. ప్రజల కోసం బయటికి వెళ్లే అలవాటు కేసీఆర్కు ఏనాడూ లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొన్ని ఓట్లు తెచ్చుకునేందుకు కొత్త ఎత్తుగడ ఎత్తుకున్నారని రేవంత్రెడ్డి విమర్శించారు. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టును పరిశీలించిన వారిలో ఉన్నారు.