Siddipet : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల విజయ డైరీలో రెండో రోజు కల్తీ పాల విషయం కలకలం రేపింది. పాల క్యాన్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఉప్పు, చక్కెర కలిపారు. చేర్యాల విజయడైరీ మేనేజర్ పాలని పరీక్షించి వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మేనేజర్తో పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగారు. పాడి రైతుల ఫిర్యాదుతో విజయ డైరీ మెనజర్ నేరుగా రైతుల వద్దకు వెళ్లారు.
రైతుల వద్ద సేకరించిన పాలను అధికారులు పరీక్షించారు. స్వచ్ఛమైన పాలు అని తెలింది. వెన్న ఎక్కువ వచ్చేందుకు పాల క్యాన్లలో ఉప్పు, చక్కెర కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికైనా పాలు కల్తీ చేస్తున్నవారి తీరు మార్చుకోవాలని విజయ డైరీ మెనజర్ హెచ్చరించారు. కల్తీ అయిన 52 క్యాన్ల పాలను పాడి రైతులు పారబోశారు.
కల్తీ వ్యవహారంపై అధికారులు కన్నెర జేస్తున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండ్ ముసుగులో స్వచ్ఛమైన ఆహారాన్ని సైతం కల్తీ చేసేస్తున్నారు. అయితే అధికారులు హెచ్చరించినా పట్టించుకోని కొందరు అక్రమార్కులు.. మరోసారీ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎవరు కల్తీ చేస్తున్నారో త్వరలోనే తేలుస్తామని అధికారులు అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అధికారులు మండిపడ్డారు.