Congress : తమ పార్టీ వార్ రూం నుంచి అదుపులోకి తీసుకున్న ముగ్గురి వ్యక్తుల జాడ చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణను హైకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది. ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వార్ రూమ్ నుంచి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని కాంగ్రెస్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 18 గంటల పాటు వారిని అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. ఈ వాదనలను స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు 2022 నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కోర్టుకు వివరించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారని తెలిపారు.
పోలీసుల వాదనపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది ఎఫ్ఐఆర్ నమోదైన 20 రోజుల తర్వాత పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ముగ్గురిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నందుకుగానూ ఒక్కొక్కరికీ రూ.20 లక్షల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ టీమ్ హెడ్ సునీల్ కనుగోలు ఆఫీసుపై సైబర్ క్రైమ్ పోలీసులు రెండురోజులు క్రితం దాడి చేశారు. ఆ సమయంలో మాదాపూర్ లోని కార్యాలయం నుంచి ఉద్యోగులను బయటకు పంపించేశారు. కంప్యూటర్లను సీజ్ చేశారు. ఆఫీసుకు సీల్ వేశారు. పోలీసుల వచ్చిన సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు సునీల్ ఆఫీసులోనే ఉన్నారు. అప్పుడు పోలీసులతో టికాంగ్ నాయకులు వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ మండిపడ్డారు. అయినా, పోలీసులు వారందరినీ బయటకు పంపించేసి తనిఖీలు పూర్తి చేశారు.
సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారనేది సునీల్ కనుగోలుపై ఉన్న ఆరోపణ. ఫేక్ సోషల్ మీడియా ఐడీలతో.. ఫేక్ పోస్టులు పెడుతున్నారనే కేసులో సునీల్ కనుగోలు కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలిపారు. అధికార పార్టీ కాంగ్రెస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీకాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.