Adilabad : తన చావుకు సీఎం కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామంలో జరిగింది. రమాకాంత్ అనే యువకుడు నిన్న సాయంత్రం బోరజ్ గ్రామ శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మృతి చెందిన స్థలంలో ఓ సూసైడ్ నోట్ దొరికింది.
“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం సార్ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు. నా చావుకు మీరే కారణం” అంటూ సూసైడ్ నోట్లో తనకు వచ్చిన భాష, పదాలతో రాశారు.
అయితే రైతుబంధు నిధులను వ్యవసాయ భూములు ఉన్న రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. అయితే భూమి లేని రైతులు, కౌలు రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ఈ క్రమంలోనే వ్యవసాయం చేసే కౌలు రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తమ కుమారుడికి దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.