Telangana BRS latest news(Today breaking news in Telangana): తెలంగాణలో అధికార BRS ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు పడటంతో మిగితా ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలోని 28 మంది ఎన్నికను సవాల్ చేస్తూ విపక్ష అభ్యర్ధులు వేసిన పిటిషన్ల విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెలాకరులోపు వీటిపై తీర్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరిపై వేటు పడుతుందోనని ఆందోళనకు గురౌతున్నారు.
తెలంగాణ హైకోర్టులో మొత్తం దాదాపుగా 28 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన ఎలక్షన్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. 2018 ఎన్నికల సందర్భంగా ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ పిటిషన్ల తీర్పుపై నేతల్లో అలజడి మొదలైంది. శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్.. మర్రి జనార్దన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిపై ఎలక్షన్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.
తాజాగా శ్రీనివాస్ గౌడ్పై ఎలక్షన్ పిటిషన్పై ట్రయల్ ప్రారంభమైంది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్రాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్పై అడ్లూరి లక్ష్మణ్ ఎలక్షన్ పిటిషన్ వేశారు. ఇప్పటికే కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ముందు కొప్పుల, అడ్లూరి వాంగ్మూలం ఇచ్చారు. గంగులపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి రిటైర్డ్ జడ్జి శైలజతో హైకోర్టు కమిషన్ నియమించింది. ఆగస్టు 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామిన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.