Medico Preethi Case Updates(TS News): తెలంగాణలో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్ కు బెయిల్ లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం న్యాయమూర్తి వై.సత్యేంద్ర షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పది వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి ఇద్దరు పూచీకత్తును కోర్టుకు సమర్చించాలని బెయిల్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని సైఫ్ ను ఆదేశించారు. చార్జిషీట్ దాఖలు చేసే వరకు లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలన్నారు. నిందితుడు.. మృతురాలి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు కోరవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇప్పటికే సైఫ్ బెయిల్ పిటిషన్ ను మూడు సార్లు తిరస్కరించారు. దాదాపు 58 రోజుల తర్వాత నిందితుడికి బెయిల్ మంజూరు అయ్యింది. ప్రస్తుతం ఖమ్మం జైలులో ఉన్న సైఫ్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక వైద్య విద్యార్థిని మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పోలీసులు సైఫ్ ను అరెస్ట్ చేశారు.
మెడికో ప్రీతి సోదరుడు పృథ్వీ.. పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు తమకు పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వలేదన్నారు. ఘటన జరిగిన రూమ్ ను ఎందుకు అన్ సీజ్ చేశారని ప్రశ్నించారు. HOD, ప్రిన్సిపల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రీతి మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమైతే.. ఆ రోజు కడుపుకు ఎందుకు ఆపరేషన్ చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు దర్యాప్తును సరిగ్గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.