Accident to Rohit Reddy : బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురైంది. శృంగేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళూరు సమీపంలో ముడూరు – నల్లూరు క్రాస్ వద్ద రోహిత్ రెడ్డి వాహనం టైర్ బ్లాస్ట్ అయింది. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి.
ప్రమాదం నుంచి రోహిత్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మరో వాహనంలో రోహిత్ రెడ్డిని శృంగేరికి పంపించారు. రోహిత్ రెడ్డి కారుకు యాక్సిడెంట్ అయిందనే సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదంలో ఆయనకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను క్షేమంగానే ఉన్నానని ఎమ్మెల్యే చెప్పారు. తాను ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం వాస్తమేనని, అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బయట పడ్డానని వెల్లడించారు. తన గురించి వదంతులు నమ్మవద్దని, తాను క్షేమంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.