FarmHouse Case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దూకుడు మీదున్న సిట్ కు సడెన్ బ్రేకులు పడ్డాయి. బీఎల్ సంతోష్ నుంచి రఘురామ వరకూ.. ఏ ఒక్కరినీ వదలకుండా నోటీసులు ఇచ్చిన సిట్ కు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ముగ్గురు నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది సిట్. 5 రోజుల కస్టడీకి అనుమతించాలని కోరింది.
అయితే, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి ఇచ్చామని.. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వలేమని కోర్టు తెలిపింది. ల్యాప్ టాప్, సెల్ ఫోన్స్ నుంచి కీలక సమాచారం రాబట్టామని.. ఆయా అంశాలపై మరింత సమగ్రంగా ప్రశ్నించాల్సి ఉందని సిట్ కోర్టుకు విన్నవించింది. నిందితులపై లేనిపోని కేసులు పెట్టారని.. ఇది రాజకీయ వేధింపేనని.. ఇప్పటికే అనవసరంగా 25 రోజులకుపైగా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంచారని.. మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని నిందితుల తరఫు లాయర్ కోర్టును కోరారు. దీంతో, 5 రోజుల కస్టడీ కావాలంటూ సిట్ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది ఏసీబీ స్పెషల్ కోర్టు.
గతంలో రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకొని ఆ ముగ్గురు నిందితులను విచారించింది సిట్ బృందం. ఆ విచారణలో అనేక విషయాలు రాబట్టారు. బీఎల్ సంతోష్ తో పాటు తుషార్, కేరళ వైద్యుడు జగ్గు స్వామి, లాయర్ శ్రీనివాస్ ల గురించి సమాచారం సేకరించింది. వారిచ్చిన వివరాల ప్రకారమే.. వారికి నోటీసులు కూడా జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోవడంతో తుషార్, జగ్గు స్వామిలపై లుకవుట్ నోటీసులు కూడా ఇష్యూ చేయడం కలకలం రేపింది.
ఇక, బీఎల్ సంతోష్ విచారణకు హాజరుకావడంపై హైకోర్టులో కేసు నడిచింది. సంతోష్ బిజీగా ఉన్నారని ఆయన తరఫు లాయర్ చెప్పగా.. మరోసారి ఈ-మెయిల్ లో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలని సిట్ కు సూచించింది కోర్టు. తుషార్, జగ్గు స్వామిలు నోటీసులకు స్పందించకపోవడంతో వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది సిట్.
ఇలా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తూ.. తాజాగా ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులును మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సిట్. అయితే, కస్టడీ పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేయడంతో.. హైకోర్టును ఆశ్రయించాలని సిట్ భావిస్తోంది.