Sheep distribution scam Telangana(TS today news): గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశుసంవర్థక శాఖ మాజీ సీఈ రాంచందర్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అరెస్ట్ చేశారు. రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
వీరిద్దరూ కూడా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా అనుచిత లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయమైన నష్టం కలిగించి రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఏసీబీ గుర్తించింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 2 వారాల రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: ‘అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్కు అభ్యంతరం ఎందుకు..?’
కాగా, గొర్రెల పంపిణీ స్కామ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసినవారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ దూకుడు పెంచడంతో భవిష్యత్ లో ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ? అన్న అంశం పశుసంవర్ధక శాఖ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.