– రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ ఎన్నిక
– కేకే రాజీనామాతో ఖాళీ అయిన సీటు
– తెలంగాణ నుంచి బరిలో దిగి విజయం
– మూడవసారి రాజ్యసభకు వెళ్లనున్న సింఘ్వీ
Rajya Sabha MP: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలవగా, ఇండిపెండెంట్గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, స్వతంత్ర అభ్యర్థిని తగినంత మంది ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సింఘ్వీ తరఫున తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోనున్నారు.
మూడోసారి ఎన్నిక
అభిషేక్ మను సింఘ్వీ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. 2006, 2018లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికై సేవలందించారు. 2024 మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్ నుంచి పోటీచేసి భాజపా చేతిలో ఓడిపోయారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా… జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవలు కాంగ్రెస్కు కీలకమైనందున ఆయనకే అధిష్ఠానం అవకాశం కల్పించింది. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ కాగా, ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగిన మను సింఘ్వీ నామినేషన్ దశలోనే సింఘ్వీ ఎన్నికయ్యారు. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 12 ఖాళీల భర్తీకి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read: Revanth Reddy: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తు్న్నారా? సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తులు షురూ
ఇదీ నేపథ్యం..
అభిషేక్ మను సింఘ్వీ 1959 ఫిబ్రవరి 24న రాజస్థాన్లోని ఓ మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి లక్ష్మీ మాల్ సింఘ్వి సుప్రసిద్ధ లాయర్ గానే గాక బ్రిటన్లో భారత రాయబారిగానూ సేవలందించారు. 1998లో రాజ్యసభ ఎంపీగా ఆరేళ్ల పాటు సేవలందించారు. ఇక.. అభిషేక్ పాఠశాల విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్లో చదివాడు. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ట్రినిటీ కాలేజ్లో బీఏ, ఎంఏ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన రాజ్యాంగ న్యాయవాది సర్ విలియం వేడ్ వద్ద అభిషేక్ పీహెచ్డీ పూర్తి చేశారు. భార్య అనితా సింఘ్వీ సూఫీ సంగీత విద్వాంసురాలు. 37 సంవత్సరాల వయస్సులో, 1997లో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన అదనపు సొలిసిటర్ జనరల్గా అభిషేక్ ఎంపికై ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగాడు. 2001 నుండి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఈయన రాజ్యసభ సభ్యుడిగా పలు ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా సేవలందిచారు.