Stray Dog Attack: తెలంగాణలో వీధి కుక్కలు సైర విహారం చేస్తున్నారు. కనిపించిన వాళ్లపై దాడి చేస్తున్నాయి. పిక్కలు పట్టేస్తూ.. గజగజా వణికిస్తున్నాయి. ఒక్క రోజులోనే.. ఏకంగా 29 మందిపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్లో 14 మందిపై ఒకే కుక్క దాడి చేసింది. బాసరలో ఏకంగా 15 మంది కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క కాటుకు గురి అయినవారిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అందరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
మంగళవారం రాజేంద్ర నగర్ పరిధిలోని పోచమ్మ ఆలయం దగ్గర చాయ్ అమ్ముకుంటున్న రమేష్(35)తో పాటు అక్కడే ఆడుకుంటున్న కౌశిక్ కుమార్(4)పై పిచ్చి కుక్క దాడి చేసింది. స్థానికులు తరమటంతో.. అక్కడి నుంచి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(నార్మ్) మెయిన్ గేటు దగ్గరికి వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తోన్న సెక్యూరిటీ సిబ్బందిని కరిచింది.
మళ్లీ అదే కుక్క అక్కడి నుంచి వెళ్లగొట్టటంతో.. మళ్లీ పోచమ్మ దేవాలయం వీధిలోకి వచ్చింది. ఆ దారి వెంట వెళ్తున్న ఎస్కే సింగ్, రామకృష్ణ, శరత్ కుమార్, రమేశ్, చెన్నయ్య, మల్లిక, ఆండాలు, నరేందర్, రాజ్వీర్, యాదగిరి, రంగన్న, జాకీర్, కౌశిక్ కుమార్, రాజును కరిచింది. వీళ్లందరికీ.. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వసంత పంచమి సందర్భంగా బాసరకు ఓవైపు భక్తులు పోటెత్తారు. మరోవైపు వారిపై కుక్కలు రెచ్చిపోయాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ రక్తం కళ్ల చూశాయి. మంగళవారం అర్ధరాత్రి పూట ఓ లాడ్జ్ దగ్గర ఉన్న నలుగురిని కుక్కలు కరిచాయి. ఆ తర్వాత మరో 11 మందిపై దాడి చేశారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏకంగా 15 మందిని కుక్కలు కరవటంతో భక్తులంతా వణికిపోతున్నారు.