Passenger: ఇటీవల ఓ మూడో తరగతి బాలుడు టీచర్ తనని కారణం లేకుండా కొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వింత ఘటనలు పోలీసులకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే పోలీసులకు మాత్రం ఊహించిన అనుభవం ఎదురైంది. అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
స్టేషన్ ఘనపూర్కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడు. అప్పటికే కాకతీయ ప్యాసింజర్ రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కాడు. హడావుడిగా రైలు ఎక్కడంతో అతని కాలుకున్న చెప్పు ఒకటి జారి ట్రాక్పై పడిపోయింది. ట్రైన్ ఆల్రడీ కదలడంతో దిగి తీసుకోలేని పరిస్థితి. ఇక చేసేది ఏమీ లేక అలానే హైదరాబాద్ వెళ్లాడు ఆ యువకుడు.
రూమ్కి వెళ్లాక అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ట్విట్టర్ వేదికగా రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ట్రైన్ ఎక్కుతుండగా తన చెప్పు జారిపడిపోయిందని.. ఎలాగైనా దాన్ని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం స్టేషన్ ఘన్పూర్ స్టేషన్ వద్ద గాలించి ఎట్టకేలకు చెప్పును కనుగొన్నారు. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలుపించుకొని చెప్పును అప్పగించారు.