Ponguleti : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ఖమ్మంలో నిర్వహించే చివరి ఆత్మీయ సమ్మేళనానికి ప్రాధాన్యం సంతరించుకుంది. తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి పూర్తి క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మం వైఎస్ఆర్ నగర్ రోడ్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫ్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు.
ఇప్పటికే పొంగులేటి పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారు. ఆయన కాంగ్రెస్లో చేరడం లాంఛనమే. బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో గులాబీ బాస్ కేసీఆర్.. పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయనతో బీజేపీ సంప్రదింపులు జరిపింది. పొంగులేటి కాషాయ కండువా కప్పుకుంటారని తొలుత జోరుగా ప్రచారం జరిగింది. స్వయంగా బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ పొంగులేటి మాత్రం కాంగ్రెస్వైపే మొగ్గు చూపుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో సెంటిమెంట్ మారిపోతుందని.. ఇక్కడా అధికారంలోకి రావడం ఖాయమంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మొదటి నుంచి అంటున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పాజిటివ్ సంకేతాలు వెళ్తాయని అంచనా వేశారు. అదే నిజమవుతోంది.
ఇన్నాళ్లూ డైలమాలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ టర్న్ తీసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇదో బిగ్ టర్నింగ్ పాయింట్ గా మారింది. ఎందుకంటే.. BRSలోని అసంతృప్త నేతలు ఇటు కాంగ్రెస్లో చేరాలో, అటు బీజేపీలో చేరాలో అర్థంకాక డైలమాలో ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు క్లారిటీ వస్తోంది. కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో తొలి అడుగు పడుతోంది. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై మరింత క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.