Rangareddy : సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి.. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం హరియా నాయక్ తండాలో చోటు చేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూడవత్ నందిని 8వ తరగతి చదువుతుంది. స్కూల్ కు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. నందిని తల్లిదండ్రులు మూడవత్ శంకర్- శాంతిలు సొంత ఇల్లు లేకపోవడంతో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు.
శుక్రవారం ఉదయం కొత్త ఇంటిలో ఉన్న సంపు మోటర్ను నందిని తండ్రి ఆన్ చేయమని చెప్పాడు. కేబుల్ వైరు తేలి ఉండటంతో నందిని కుడిచేయికి తగిలింది. కుడిచేయి కాలిపోవడంతో నందిని అక్కడికక్కడే మృతి చెందింది. నందినిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. నందిని అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన కన్న కూతురు కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నందిని తల్లి అంగన్వాడీ పాఠశాలలో పనిచేస్తుంది. నందిని ఆరవ తరగతి నుండి కస్తూరిబా పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తుంది. నందిని చదువులో చాలా చురుకుగా ఉండేదని తోటి స్నేహితులు తెలిపారు.