Hyderabad : ఆదివారం ఆ చిన్నారి బర్త్ డే.. సరదాగా ఆడుకునేందుకు ప్లే జోన్ కు వెళ్లింది. ఎంతో ఉత్సాహం అక్కడ ఆడుకుంటోంది. ఇంతలోనే ఆ పాప ఓ యంత్రంలో చేయిపెట్టింది. కుడిచేతి వేళ్లు తీవ్రంగా నలిగిపోయాయి. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది.
బంజారాహిల్స్ ఇబ్రహీంనగర్కు చెందిన మెహతా జహాన్, మహియా బేగంతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -1 ఉన్న సిటీ సెంటర్ కు వెళ్లారు. నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియా ప్రాంతానికి ముగ్గురు పిల్లలను తీసుకువెళ్లారు. అక్కడ ఆ చిన్నారులు ఆడుకుంటున్నారు. ఇంతలో ఓపెన్ చేసి ఉన్న ఓ యంత్రంలో 3 ఏళ్ల చిన్నారి మెహ్విష్ లుబ్నా చేయి పెట్టింది. దీంతో కుడిచేతి మూడు వేళ్లు, చూపుడు వేలు కొంత భాగం నలిగిపోయాయి. తల్లి హుటాహుటిన చిన్నారిని చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారి కుడి చేతి 3 వేళ్లు పూర్తిగా నలిగిపోయాయని గుర్తించారు. ఆ వేళ్లను తొలగించారు.
ఈ ప్రమాదంపై పాప తండ్రి మక్సూద్ బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైట్ చేశారు. మాల్ నిర్వాహకులు, స్మాష్ జోన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా స్మాష్ జోన్లో సిబ్బంది అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు. ఆ యంత్రం వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె 3 వేళ్లు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని తొలగించారని ఆరోపించారు. ఆ ఫుటేజీ తమ వద్ద లేదని సిబ్బంది చెప్పారన్నారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సిటీ సెంటర్ మాల్ మేనేజ్మెంట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.