Boy : తెలంగాణలో వీధి కుక్కలకు మరో బాలుడు బలయ్యాడు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేక్వార్టర్స్లో 8 ఏళ్ల పసివాడు శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్కు వచ్చారు. వీరు సంచార జాతులవారు. ఆహారం వండుకునేందుకు రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న పార్కుకు గురువారం రాత్రి వచ్చారు.
శుక్రవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత బహిర్భూమికి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి చోటూ వెళ్లాడు. అక్కడే ఆరు వీధి కుక్కలున్నాయి. ఒక్కసారిగా ఆ కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. చెట్టు కొమ్మకు దుస్తులు చిక్కుకోవడంతో చోటూ వాటి నుంచి తప్పించుకోలేపోయాడు. ఎటు కదల్లేక అక్కడే కింద పడిపోయాడు.
దాదాపు 15 నిమిషాలపాటు కుక్కలు బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చోటూ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.
రైల్వే క్వార్టర్స్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 4 రోజుల క్రితం ఓ బాలికపై కుక్కలు దాడి చేశాయని తెలిపారు. 10 రోజుల క్రితం ఓ రైల్వే ఉద్యోగిపైనా కుక్కలు దాడి చేశాయని అంటున్నారు.