Khammam : రైతు పంట వేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అకాలవర్షం వల్ల పంటలకు నష్టవాటిల్లుతుంది. పంటకు తెగుళ్లు సోకడం వల్ల అనుకున్నదాని కంటే తక్కువ దిగుబడి వస్తుంది. ఇలా రైతు ఏదో ఒక కారణంతో పంట నష్ట పోతాడు. ఖమ్మం జిల్లాలోనూ ఓ రైతుకు పంట చేతికి వచ్చింది కాని నోటికి అందలేదు.
వైరా మండలంలో శాంతినగర్ గ్రామానికి చెందిన కొల్లి నరసింహారావు అనే రైతు గ్రామంలో పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి ,మొక్కజొన్న పంటలు సాగు చేశారు. రెండు ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను కోసి పక్కనే ఉన్న వెంచర్ లో ఎండబోశారు.
ఎండిన మిర్చిని కుప్ప వేసి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది క్వింటాళ్ల మిర్చిని వాహనంలో ఎత్తుకెళ్లారు. తెల్లవారు జామున మిర్చి కల్లం దగ్గరికి రైతు వెళ్లి చూశాడు. మిర్చి చోరీకి గురైందని గుర్తించి వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు లక్షల విలువైన మిర్చి చోరీకి గురైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.