9 People died in Telangana due to Heavy rains: తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటర్ ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. ఇటు భారీ వర్షాలు.. అటు వరదల బీభత్సం.. దీంతో తెలంగాణ అతులాకుతలమైపోతుంది. చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలువురు వరదల్లో చిక్కుకుపోయారు. వరద నీరు ముంచెత్తడంతో తమను కాపాడాలంటూ సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. మొత్తంగా గత రెండురోజులుగా భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో పలువురు మృత్యువాతపడ్డారు. కోదాడలో ఇద్దరి మృతదేహలు వరదలో కొట్టుకువచ్చాయి. ఆ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 9 మంది మృతిచెందినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Also Read: మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి కంటతడి
ఇదిలా ఉంటే.. మున్నేరు వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. దీంతో ఖమ్మంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మున్నేరు వరద బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విశాఖ నుంచి తెప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. విశాఖలోని నేవీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడినట్లు వెల్లడించారు. ఖమ్మం నగరానికి రెండు నేవీ హెలికాప్టర్లను పంపించాలంటూ వారిని కోరినట్లు చెప్పారు. ఇటు కోదాడలోనూ వర్షం బీభత్సం సృష్టిస్తుండడంతో అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లల్లో చిక్కుకున్నవారిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: ఖమ్మంలో కాపాడాలంటూ ఆర్తనాదాలు.. హెలిక్యాప్టర్ కావాలని ఫోన్ చేసిన భట్టి
ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా కూసమంచి మండలంలోని నాయకన్ గూడెంలో విషాదం చోటు చేసుకుంది. పాలేరువాగులో ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీ దంపతులు గల్లంతయ్యారు. వారితోపాటు గల్లంతైన వారి కొడుకును రెస్క్యూ టీం రక్షించింది. గల్లంతైన దంపతుల ఆచూకీ కోసం రెస్క్యూ టీం తీవ్రంగా గాలిస్తున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. తమను కాపాడాలంటూ దంపతులు తమకు ఫోన్ చేసి ఆర్తనాదాలు చేస్తుంటే, తనకు బాధేసిందంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. వారు క్షేమంగా బయటపడాలంటూ ఆ దేవుడిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రార్థించిన విషయం తెలిసిందే.