Khairatabad Ganesh Utsav 2024: తెలుగురాష్ట్రాల్లో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగా వైభవంగా చేస్తున్నారు. ఊరూవాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. ఎడతెరపి లేని వానలు, వరదతో కాస్త ఇబ్బంది పడినా.. వరుణుడి కాస్త శాంతించటంతో చాలాచోట్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. మరోసారి ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు.
ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి.. పూజలు నిర్వహిస్తున్నారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు.. రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది.
ఖైరతాబాద్ గణనాథుడి తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ని తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు. ఈ ఏడాది సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. భారీ వినాయకున్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..
రెండురోజులు సెలవు రావటంతో ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు.