Accident : మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అండర్ బ్రిడ్జిపై నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. నిరసన ప్రాంతం దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. మృతుల బంధువులను మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.
నిన్న రాత్రి మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.