3 Sanitation Workers Died While Cleaning Manhole: మార్చి 1న హైదరాబాద్లోని కుల్సుంపురా వద్ద మ్యాన్హోల్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందిన ఘటన నగరంలో కలకలం రేపింది.
మృతులను ఎం శ్రీనివాస్ (40), వి. హన్మంత్ (42) ఎం. వెంకటేశ్వర్ రావు (40) గా గుర్తించారు. కుల్సుంపురా సబ్ఇన్స్పెక్టర్ బి. మన్మోహన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1న శ్రీనివాస్ మ్యాన్హోల్ శుభ్రం చేయాడానికి కవర్ తెరిచాడు. బ్యాలెన్స్ తప్పి అందులో పడిపోయాడు.
శ్రీనివాస్ను కాపాడేందుకు తోటి కార్మికులు హన్మంత్, వెంకటేశ్వర్రావు మ్యాన్హోల్లోకి దిగారు. అయితే వారు విషవాయువు పీల్చి స్పృహతప్పి పడిపోయారు. దీంతో వీరు ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. కాగా.. వారిని ఆదుకునేందుకు ప్రయత్నించిన మరో కార్మికుడు జీవన్ రాజ్ విషవాయువు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు.
బాధితులు అయ్యప్ప ఇన్ఫ్రా కాంట్రాక్టు ఏజెన్సీ రోజువారీ వేతనంపై పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ అయ్యప్ప ఇన్ఫ్రా తమ కార్మికులకు శ్వాస మాస్క్లు అందించడంలో విఫలమైందని, ఇది ముగ్గురు వ్యక్తుల మరణానికి దారితీసిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు పారిశుధ్య కార్మికుల మృతిపై కాంట్రాక్టు ఏజెన్సీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.