Rains Alert for Telangana (TS Rain news Today) : తీవ్రమైన ఎండలు, అధిక వేడి, విపరీతమైన ఉక్కపోత.. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దాదాపు దేశమంతా నెలకొన్న పరిస్థితి. ఏప్రిల్ ఆరంభం కావడంతోనే ఎండల తీవ్రత మరింత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకింది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఏదీ ఇంటి నుంచి బయటికొస్తావా ? వస్తే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ సూరీడు భయపెడుతున్నాడు. తప్పనిసరిగా బయటికొచ్చిన వారి మాడు పగలగొడుతున్నాడు.
ఇలాంటి సమయంలో వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. రేపటి నుంచి తెలంగాణలో, 8,9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం నుంచి 3 రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే సోమవారం ఈ రెండు జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో మాత్రం వర్షాలు పడే అవకాశం లేదని తెలిపింది.
ఇదేసమయంలో హైదరాబాద్ లో ఎండ తీవ్రత పెరగవచ్చని పేర్కొంది. వడగాలుల తీవ్రత పెరగడంతో పాటు.. ఉష్ణోగ్రతలు కూడా 2-3 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.