Telangana : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఈసారి మహిళా చైతన్యం ప్రత్యేకమైనదిగా చెప్పాలి. ఎందుకంటే ధైర్యంగా ముందుకొచ్చి లైనులో నిలుచుని ఓటు వేయడం కాదు, ఏకంగా పోటీలోనే నిలవడం ఒక విశేషం. 2023 తెలంగాణ ఎన్నికల్లో 222 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, తమకి సీటు ఇస్తారని ఎదురుచూడలేదు. తమ మీద తమకి నమ్మకంతో ధైర్యంగా పోటీలో నిలుచున్నారు. ఎన్నికలకే ఒక గ్లామర్ ని తీసుకొచ్చారు.
ఇంతమంది పోటీ పడటం వెనుక రాజకీయ ఎత్తుగడ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆల్రెడీ పార్లమెంట్ లో మహిళా బిల్లు ఓకే అయిపోయింది.
ఈసారి ఎన్నికల్లో అమలు చేయకపోయినా, త్వరలో కార్యరూపం దాల్చనుంది. రానున్న అవకాశాలను గుర్తించి, ముందే కర్చీఫ్ వేసే పనిలో పడ్డారని కూడా అనుకోవచ్చు. అందుకే తెలివిగా ఇండిపెండెంట్లుగా పోటీలో దిగారు.
భవిష్యత్తులో రాజకీయ పార్టీలు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే, ఇక ఎవరున్నారని వెతుక్కునే పని ఉండదు. ఇప్పుడు ఎన్నికల్లో తమకి సొంతంగా వచ్చే ఓటు బ్యాంకు కూడా వారికి హెల్ప్ అయ్యేలా ఉంది. అందుకనే ముందు జాగ్రర్త చర్యగా ఈ ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు.
రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని ఆలోచనలు చేస్తే, వస్తే మాత్రం చక్రం తిప్పడం ఖాయమని అంటున్నారు. లేచింది మహిళా లోకం, దద్ధరిల్లింది పురుష ప్రపంచం అని నెట్టింట పాటలు, కొటేషన్లు అప్పుడే మొదలైపోయాయి.
డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఉన్నంతలో మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించాయి. బీఆర్ఎస్ 08, కాంగ్రెస్ 12, బీజేపీ 13 మంది, జనసేన ఒకరు… మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించాయి.
మొత్తం 119 స్థానాల్లో 2,067 మంది పురుషులు పోటీ చేస్తుండగా, 222 మంది మహిళామణులు బరిలో నిలిచారు. వీరితో పాటు ఇద్దరు థర్డ్ జెండర్లు పోటీలో ఉండటం విశేషం.
వరంగల్ ఈస్ట్ నుంచి బీఎస్పీ తరఫున చిత్ర పుష్పితలయ పోటీలో ఉన్నారు. తర్వాత చూస్తే జడ్చర్లలో రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ నుంచి జానకమ్మ పోటీ చేస్తున్నారు.
పోటీ చేస్తున్న వారిలో యువత అధిక సంఖ్యలో ఉండటం విశేషం. 25-30 ఏళ్ల మధ్య వయసున్న వారు 240 మంది ఉన్నారు. ఆ తర్వాత 31 నుంచి 40 ఏళ్ల మధ్య పోటీ చేసేవారు 747 మంది ఉన్నారు. మిగిలిన వారు రకరకాల వయసున్నవారు ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి చీటి శ్యామల, వేములవాడ నియోజకవర్గం నుంచి జక్కని భూపతి 80 ఏళ్ల వయసులో పోటీ చేస్తున్నారు.
రాష్ట్రం మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది ఉన్నారు. వీరిలో 1,63,13,268 మంది పురుషులు ఉంటే, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. స్త్రీలకన్నా పరుషులు 11 వేలు మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నారు.