Hotel: కాస్త మంచి టీ తాగాలంటే 20 రూపాయలు పెట్టాల్సిందే. అరడజను అరటిపండ్లు కొనాలన్నా 30 అవుతోంది. అలాంటిది కేవలం 20 రూపాయలకే కమ్మని ఇంటి భోజనం పెడుతుండటం మామూలు విషయం కాదు. ఈశ్వర్ ఛారిటీస్ సంస్థ ఆ పని చేస్తోంది. విజయవాడలో రూ.20కే మంచి భోజనం అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.
ఇద్దరు దాతలు కలిసి ఈశ్వర్ ఛారిటీస్ ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లేట్ భోజనం తయారు చేయాలంటే కనీసం రూ.60 ఖర్చు అవుతుండగా.. వాళ్లు మాత్రం 20కే వడ్డిస్తున్నారు. మిగిలిన 40 రూపాయలు వారే భరిస్తున్నారు. అలా అతితక్కువ ధరలో, రుచికరమైన ఆహారం అందిస్తూ ఎందరి ఆకలో తీరుస్తున్నారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
విజయవాడ శిఖామణి సెంటర్ లో సొంత భవనంలో ‘మన భోజనశాల’ పేరుతో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు తెరిచి ఉంటుంది. కప్పునిండా అరకిలో పరిమాణంలో వేడివేడి అన్నం, రెండు కూరలు, రోటి పచ్చడి, సాంబారు, మజ్జిగ. ఇదీ మెనూ. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అదనంగా ఇస్తారు.
తక్కువ ధర అని ఆలోచించాల్సిన పని లేదు. నాణ్యమైన పదార్థాలనే వాడతారు. ఫ్రెష్ అండ్ క్వాలిటీ కూరగాయలతోనే వంట చేస్తారు. పాత్రలు శుభ్రంగా తళతళ మెరుస్తుంటాయి. సిబ్బంది సైతం హైజెనిక్ గా ఉంటారు. కేవలం సేవా భావం మాత్రమే కానీ, ఎక్కడా వ్యాపార ధోరణి కనిపించదు.
పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ పనులపై నగరానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు.. ఇలా అందరికీ అత్యంత తక్కువ ధరలో మంచి ఇంటి భోజనం అందిస్తున్న ఈశ్వర్ ఛారిటీస్ ను అభినందించాల్సిందే.