Yuvraj Singh : 42 ఏళ్ల యువరాజ్ సింగ్ అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లోకి వస్తుంటాడు. అయితే ఈసారి అభిమానులకు ఒక మంచి వార్త చెప్పాడు. అదేమిటంటే త్వరలో తను కోచ్ అవతారం ఎత్తుతానని అన్నాడు. అవకాశం వస్తే ఐపీఎల్ వేదికగా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
అయితే ఇందులో చిన్నతిరకాసు పెట్టాడు. తన పిల్లలు స్కూల్ కి తమంతట తాము వెళ్లిన తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ పై ఫోకస్ పెడతానని అన్నాడు. ఇందులో విశేషం ఏముంది? ప్రతీ క్రికెటర్ చేసే పని అదే కదా… అందరూ ఏదొక పాత్రలోకి వెళుతున్నారు. కొందరు కామెంటేటర్లుగా అవతారం ఎత్తుతున్నారు. కొందరేమో మెంటర్లుగా వెళుతున్నారు. కొందరు కోచ్ లుగా వెళుతున్నారు.
అలాగే యువరాజ్ కూడా వెళుతున్నాడని అనుకుంటున్నారా? అది కాదండీ.. మనోడు బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తో వెళుతున్నాడు. మన టీమ్ ఇండియాలో యువ క్రికెటర్లను మానసికంగా దృఢంగా చేస్తానని అంటున్నాడు.
అంటే ఫైనల్ మ్యాచెస్ లో మన యువత చేతులెత్తేస్తోందని అంటున్నాడు. ఇప్పుడు మనవాళ్లకి టెక్నిక్ అవసరం లేదు, అలాగే శారీరకంగా ఫిట్ నెస్ అవసరం లేదు. అవన్నీ ఉన్నాయి, కాకపోతే మ్యాచ్ క్లిష్టంగా మారే సమయంలో క్రికెటర్లు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అదెలా అన్నది నేను తర్ఫీదిస్తానని తెలిపాడు.
ఎన్నో మ్యాచ్ ల్లో చివరి వరకు ఉండి, పోరాడి టీమ్ ఇండియాను గెలిపించిన యువరాజ్ బలం అదే. అంతేకాదు ఐసీసీ కప్ లు గెలిచిన టీమ్ ఇండియాలో యువరాజ్ బెస్ట్ ఫినిషర్ గా ఉన్నాడు. ఎప్పుడూ టాప్ ఆర్డర్ లో ఐదు లేదా ఆరో స్థానంలో వచ్చి, మ్యాచ్ కి అనుగుణంగా తనని తాను మార్చుకుని డిఫెన్స్ ఆడాల్సిన చోట ఆడుతూ, రన్ రేట్ పెంచాల్సిన చోట పెంచుతూ మ్యాచ్ ని ఒంటిచేత్తో ఎన్నో సార్లు గెలిపించాడు.
ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టిన తనని ఎవరు మరిచిపోగలరు. అలాంటి యువరాజ్…యువ క్రికెటర్లకు మార్గనిర్దేశనం చేస్తాననేసరికి అందరూ అభినందనలు చెబుతున్నారు. అదీ కూడా అలా ఇలా కాదు, మెంటల్ గా ప్రిపేర్ చేస్తానని చెబుతున్నాడు. దేశం కోసం, క్రికెట్ కోసం ఎంతో చేసిన యువరాజ్ లాంటి వాళ్లు మళ్లీ రావాలని, తమ సేవలను ఏదొక రూపంలో అందించాలని అభిమానులు కోరుతున్నారు.