Yuvraj Singh from Gurdaspur on BJP Ticket: సెలబ్రిటీలు అందరూ కూడా ఒక ఫేజ్లో తాము అనుకున్న రంగాల్లో ఒక వెలుగు వెలిగి, తర్వాత ఆ ప్రభతో రెండో ఫేజ్లో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటారు. ఒక స్థాయికి వెళ్లిన ప్రముఖులు చాలామంది తమ డెస్టినీ రాజకీయాలుగానే భావిస్తారు. అందులోకి ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా రానున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించిన క్రికెటర్ మనోజ్ తివారి బెంగాల్ క్రీడా శాఖామంత్రిగా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యాడు. టీమ్ ఇండియా ఒకనాటి ఓపెనర్ గౌతం గంభీర్ న్యూ ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హర్భజన్ సింగ్ ఆమ్ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇప్పుడు వీరందరిక సరసనా చేరేందుకు యువరాజ్ సింగ్ రెడీగా ఉన్నాడని అంటున్నారు. ఆ గాలి ఎందుకు వీచిందంటే, దీనికి ఒక చిన్న కారణం ఉంది. అదేమిటంటే యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నమ్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. దాంతో ఈ ప్రచారానికి బలం చేకూరుంది.
Read More: బ్రేకింగ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?
రానున్న లోక్సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ బీజేపీ అభ్యర్థిగా పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానానికి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురుదాస్పూర్ పాకిస్తాన్-ఇండియా బోర్డర్లో ఉంటుంది. సినిమా స్టార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉంది.
రాజకీయాల్లోకి రావడంపై యువరాజ్ సింగ్ ఇంకా స్పందించలేదు. బహుశా సీటు కన్ ఫర్మ్ అయితే, అప్పుడు గురుడు బయటపడతాడని అంటున్నారు. ప్రస్తుతం గురుదాస్పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. గతంలో బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీగా నాలుగు సార్లు 1998, 1999, 2004, 2014లో విజయం సాధించారు.
మన తెలుగువాడు అంబటి రాయుడు సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చి వైసీపీలో చేరాడు. కానీ జగనన్న నుంచి సరైన హామీ లేకపోవడంతో సైలంట్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ సీనియర్స్ జట్టులో ఉన్న అంబటి రాయుడు త్వరలో జనసేనలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.