WTC Rankings : షేర్ మార్కెట్లో ధరల్లా ఎప్పటికప్పుడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక రోజుకొక తీరున పడుతూ లేస్తోంది. ఎక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ జరిగినా చాలు, అందులో విజయం సాధించిన తీరును బట్టి వెంటనే పాయింట్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో జట్లన్నీ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఒక్కరోజులోనే సినిమా అంతా మారిపోతోంది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక లో నెంబర్ వన్ స్థానానికి వచ్చిన సంగతి తెలిసిందే. పట్టుమని రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే ఒకటి నుంచి రెండుకి పడిపోయింది. కారణం ఏమిటంటే ఆస్ట్రేలియా-పాక్ మధ్య జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లను వరుసపెట్టి గెలవడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానానికి చేరింది.
నెంబర్ వన్ గా ఉన్న టీమ్ ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. రెండులో ఉన్న సౌతాఫ్రికా ఆటోమేటిక్ గా మూడుకి పడిపోయింది. నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో బంగ్లాదేశ్, ఆరో స్థానంలో పాకిస్తాన్, ఏడో స్థానంలో వెస్టిండీస్, ఎనిమిదో స్థానంలో ఇంగ్లాండ్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి.
జనవరి 25 నుంచి ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో గెలిచిన మ్యాచ్ లను బట్టి టీమ్ ఇండియా సుస్థిరమైన స్థానానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా 54 పాయింట్లు, 56.25 విజయ శాతంతో టాప్లో ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 8 టెస్టులు ఆడింది. 5 మ్యాచుల్లో గెలిచి, రెండింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక భారత్ కి వచ్చేసరికి 4 మ్యాచులు ఆడి, రెండింట్లో గెలిచింది. ఒక దాంట్లో ఓడి.. ఒకటి డ్రా చేసింది. 26 పాయింట్లు, 54.16 విజయశాతంతో రెండో స్థానంలో ఉంది.
ఎప్పటిలా ఇవి రెండే మళ్లీ ఫైనల్ కి చేరుతాయని అనుకుంటున్నారు. ఈసారైనా టీమ్ ఇండియా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలని అభిమానులు కోరుతున్నారు.