Wrestlers : భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రోడ్డెక్కబోమని స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆయనపై పోరాటం మాత్రం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అయితే కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపిందని వినేశ్ ఫొగాట్ ట్వీట్ చేసింది. అప్పటి వరకు వేచి చూస్తామని పేర్కొంది. కానీ బ్రిజ్భూషణ్పై పోరాటాన్ని మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేసింది.
మరోవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డాయి. జులై 11న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా గోహతి హైకోర్టు ఇచ్చిన స్టేతో మరో వాయిదా పడ్డాయి. అస్సాం రెజ్లింగ్ సంఘం పిటిషన్ను కోర్టు విచారించింది. తమ సంఘానికి డబ్ల్యూఎఫ్ఐ గుర్తింపు గల సంఘంగా ఉండే హక్కు ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. కానీ ఆ గుర్తింపును ఇవ్వలేదని తెలిపింది.
డబ్ల్యూఎఫ్ఐ, ఐఓఏ అడ్హక్ కమిటీ, క్రీడా మంత్రిత్వ శాఖలకు వ్యతిరేకంగా ఈ పిటిషన్ ను అస్సాం రెజ్లింగ్ సంఘం దాఖలు చేసింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు రాష్ట్ర సంఘాలు ఇద్దరు ప్రతినిధుల పేర్లు పంపడానికి ఈ నెల 25తో గడువు ముగిసింది. తమ సంఘానికి గుర్తింపు ఇవ్వటంతోపాటు ప్రతినిధుల పేర్లను పంపడానికి అనుమతివ్వాలని హైకోర్టును కోరింది. లేదంటే ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని అడ్హక్ కమిటీ, క్రీడా మంత్రిత్వశాఖలను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ జులై 17కు వాయిదా పడింది.