WPL : మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల బిడ్డింగ్లో రికార్డులు బద్ధలయ్యాయి. మహిళా జట్ల వేలం వివరాలను బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ వేలం ద్వారా బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. ఐదు జట్ల ద్వారా బీసీసీఐకి రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరింది. 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన ఆదాయం కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చిందని జై షా వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్లో విప్లవానికి నాంది పలుకుతుందన్నారు. మహిళల క్రికెట్లో సంస్కరణలను తీసుకువస్తుందన్నారు.
5 జట్లు.. రూ. 4670 కోట్లు..
5 ప్రాంఛైజీలు వేలంలో పాల్గొని జట్లను సొంతం చేసుకున్నాయి. అహ్మదాబాద్ జట్టును అదానీ స్పోర్ట్స్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,289 కోట్లకు దక్కించుకుంది. ముంబై జట్టును ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.901 కోట్లకు దక్కించుకుంది. ఢిల్లీ జట్టును జేఎస్డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.810 కోట్లకు, లక్నో జట్టును కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిడెట్ రూ.757 కోట్లకు చేజిక్కించుకున్నాయి.
వేలంలో 30 బడా కార్పొరేట్లు పోటీ పడ్డాయి. చివరకు ఈ ఐదు కంపెనీలకు ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు దక్కాయి. మహిళల క్రికెట్ లీగ్ నిర్వహణలో క్రియాశీల పాత్ర పోషించిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. లెట్ ద జర్నీ బిగిన్ అని ట్వీట్ చేశారు. మహిళల క్రికెట్కు ఆదరణ పెంచాలన్న లక్ష్యంతో బీసీసీఐ ఈ లీగ్ కు శ్రీకారం చుట్టింది.