WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో రెండో మ్యాచ్ లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. టాస్ గెలిచిన బెంగళూరు ఛాలెంజర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ , మెగ్ లానింగ్ చెలరేగి ఆడారు. కెప్టెన్ మెగ్ లానింగ్ 43 బంతుల్లో 14 ఫోర్లతో 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు చేసింది. ఈ జోడి తొలి వికెట్ 14.3 ఓవర్లలో 162 పరుగులు జోడించింది.
అయితే ఈ ఇద్దరూ ఒక్క పరుగు తేడాతో అవుట్ అయ్యారు.కానీ తర్వాత వచ్చిన కాప్ (17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 39 నాటౌట్ ), జెమీమా రోడ్రిగ్స్ ( 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 నాటౌట్) అదే జోరు కొనసాగించి.. జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 223 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. WPL తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు చేసిన 207 పరుగుల రికార్డును ఢిల్లీ బ్రేక్ చేసింది.
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే తొలుత ఓపెనర్ సోఫీ డివైన్ (14) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత కాపేటికే జోరుమీదున్న కెప్టెన్ స్మృతి మంధాన (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సుతో 35 రన్స్) అవుట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఫెర్రీ (19 బంతుల్లో 5 ఫోర్లతో 31 రన్స్) దాటిగా ఆడటంతో 10 ఓవర్ల వరకు పోటీలోనే ఉంది.
ఢిల్లీ బౌలర్ టారా నోర్రీస్ విజృంభణతో ఆ తర్వాత 7 పరుగులు తేడాలో 5 వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు పరాజయం ఖాయమైంది. 96 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో నైట్ (34), మేగాన్ షట్ (30 నాటౌట్ ) చేసిన పోరాటంతో బెంగళూరు స్కోర్ 150 పరుగులు దాటింది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో టారా నోర్రీస్ 5 వికెట్లు దక్కాయి. కాప్సీ 2 వికెట్లు, శిఖా పాండే 1 వికెట్ తీశారు. 5 వికెట్లు పడగొట్టిన టారా నోర్రీస్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.