WPL : క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్చి 8న మహిళా దినోత్సవ కానుకగా.. ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో ఓ మ్యాచ్ ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగే మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు మైదానానికి వెళ్లి ఉచితంగా వీక్షించవచ్చు.
ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా స్క్రీన్ పై ఈ ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయంపై నెటిజన్లు బీసీసీఐపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫిదా అయ్యామంటూ కామెంట్లు చేస్తున్నారు. స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్ లీగ్ను ఈ ఏడాది నుంచి నిర్వహిస్తోంది. మార్చి 4న ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్తో లీగ్ ఆరంభమైంది.
ఈ మ్యాచ్లో ముంబై జట్టు గుజరాత్పై 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 రన్స్ తేడాతో ఆర్సీబీని ఓడించింది. మూడో మ్యాచ్లో గుజరాత్ పై యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగో మ్యాచ్ లో ఆర్సీబీ పై ముంబై 9 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది.
ముంబై ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గుజరాత్, ఆర్సీబీ జట్లు ఓడిపోయాయి. అయితే ఈ రెండు జట్లే మధ్యే ఉమెన్స్ డే రోజు మ్యాచ్ జరగనుండటం ఆసక్తిని రేపుతోంది.