Champions Trophy 2025 India vs Pakistan: 2025లో పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా వెళుతుందా? లేదా? అనేది మళ్లీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్ ఇండియాకి వచ్చింది. అందువల్ల మేం అక్కడికి వచ్చాం కాబట్టి, మీరు కూడా పాకిస్తాన్ రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్టు పట్టాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ మొహిసిన్ నఖ్వి ముందడుగు వేస్తున్నాడు. దుబాయ్ లో త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షాతో మాట్లాడే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఇండియాని రప్పించేందుకు పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే అక్కడ ఇండియా ఆడితే, మళ్లీ జనాలకి క్రికెట్ పై క్రేజ్ పెరుగుతుంది. అంతేకాదు తమ క్రికెట్ బోర్డుని ఆర్థికంగా పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ గానీ ఇండియా వెళ్లిందంటే పాక్ క్రికెట్ బోర్డుకి వచ్చే శాటిలైట్ రైట్స్, ఇతర మార్గాల ద్వారా ఆదాయం కొన్ని వందలకోట్లలో ఉంటుంది.
Read More: లాస్ట్ బాల్ టెన్షన్.. టెన్షన్ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ విజయం
ఎందుకంటే దాయాదుల మధ్య పోరంటే ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. వారి మనసులో ఏమున్నా ముందు పాక్ క్రికెట్ బోర్డుని ఆర్థికంగా బలోపేతం చేయాలనేది కొత్త చైర్మన్ నఖ్వీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకు ఆయన ముందున్న ఆప్షన్లలో ఇది కూడా ఒకటని చెప్పాలి. గతంలో ఆసియా కప్ నిర్వహించినప్పుడు ఇండియా వెళ్లకపోతే పక్కనే ఉన్న శ్రీలంకలో కొన్ని మ్యాచ్ లు జరిగాయి.
మరి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా తమ దేశానికి వస్తుందా? లేదా? అనేది చూడాలని నఖ్వీ అంటున్నట్టు తెలిసింది. భారత్ చిట్టచివరిగా పాకిస్తాన్ 2008లో వెళ్లింది. అంటే పాక్ గడ్డపై ఇండియా అడుగుపెట్టి ఇప్పటికి 16 సంవత్సరాలు గడిచింది.
పాక్-ఇండియా మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఒకలా ఉండవు. అవి చాపకింద నీరులా ఉంటూనే ఉంటాయి. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు ఇండియాపై జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు చైనాతో అంటకాగుతూ భారత్ పై పాకిస్తాన్ కాలు దువ్వుతోంది. ఇవన్నీ మోదీ ప్రభుత్వానికి నచ్చడం లేదు. అందువల్ల పాక్ వెళ్లడం అంత ఆషామాషీ వ్యవహారంగా కనిపించడం లేదు.