Manu Bhaker Coach Samaresh Jung: ప్యారిస్ ఒలింపిక్ 2024లో భారత్ తరఫున తొలి పతకాన్ని సాధించిన షూటర్ మను భాకర్పై దేశ ప్రజలంతా ప్రశంసలు కురిపించారు. ఆమె ప్రతిభ గురించి మాట్లాడుతూ పొంగిపోయారు. ఆమె పతకం దేశానికి గర్వకారణం అని మురిసిపోయారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆమె గెలుపులో పాత్ర పోషించిన కోచ్ సమరేశ్ జంగ్ ఇటీవలే స్వదేశానికి వచ్చేశాడు. వచ్చీరాగానే ఆయనకు షాక్ తగిలింది. తన ఇంటిని రెండు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు నోటీసు ఇచ్చారు.
సమరేశ్ జంగ్ ఇల్లు అక్రమంగా రక్షణ శాఖకు చెందిన భూమిలో నిర్మించారని పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దారణకు వచ్చింది. రెండు రోజుల్లో ఆ ఇంటిని కూల్చేస్తామని నోటీసు ఇచ్చింది. 75 ఏళ్లుగా అదే ఇంటిలో ఉంటున్న సమరేశ్ ఈ నోటీసు చూసి ఖంగుతిన్నాడరు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఒలింపిక్ మెడల్ సాధించిన సంతోషంలో తాను ఇండియాకు తిరిగి వస్తే ఇక్కడ తాను ఒక దుర్వార్త వినాల్సి వచ్చిందని బాధపడ్డారు. తన ఇంటిని, ఇంటి ప్రాంగణాన్ని రెండు రోజుల్లో కూల్చేస్తారని నోటీసు ఇచ్చారని వివరించారు. వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు.
ఢిల్లీలో సివిల్ లైన్స్ పాస్ ఖైబర్ పాస్ కాలనీ ఏరియాకు సంబంధించిన వివాదం కోర్టులో చాన్నాళ్లు ఉన్నది. ఆ ఏరియా వాసులు, కేంద్ర రక్షణ శాఖకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. జులై 9వ తేదీన కోర్టు ఆ ఏరియా రక్షణ శాఖ పరిధిలోకి వస్తుందని తేల్చేసింది.
Also Read: లండన్ తరహాలో హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
కూల్చేసే ఏరియా హద్దులను కూడా అధికారులు పేర్కొనలేదని, ఇంటిని విడిచివెళ్లిపోవడానికి ఇచ్చిన వ్యవధి కూడా కేవలం రెండు రోజులేనని జంగ్ ఆవేదన చెందారు. నోటీసులో స్పష్టమైన వివరాలు లేవని, వాళ్లు కూల్చేసే లేదా అధీనంలోకి తీసుకునే ఏరియా హద్దులు ఏమిటో వివరించనేలేదని పేర్కొన్నారు. కనీసం తాను ఇక్కడి నుంచి గౌరవంగా వెళ్లిపోవడానికి రెండు నెలలైనా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.