KL Rahul : అగార్కర్ నేతృత్వంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎట్టకేలకు, ఆఫ్గనిస్తాన్ తో జరిగే టీ 20 జట్టుని ప్రకటించింది. ఇక్కడ కూడా ఒక మెలిక పెట్టింది. ఏదొక సంచలనం లేకపోతే వారికి నిద్రపట్టదనుకుంటా.. ఈసారి ఏకంగా కేఎల్ రాహుల్ కి ఎసరు పెట్టారు. కారణాలు చెప్పలేదు. రెస్ట్ తీసుకోమని చెప్పారా? లేక టీ 20 ఆటకి, అతనింక సూట్ కాడని డిసైడ్ అయ్యారా ? తను మొత్తం డిఫెన్సివ్ ప్లే ఆడుతున్నాడని భావించారా? ఏ సంగతీ తెలీదు. ఎవరికేమీ చెప్పకుండా పక్కన పెట్టారు.
ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారింది. మొత్తం 16మందిని ఎంపిక చేసి, అందులో కేఎల్ రాహుల్ కి చోటు కల్పించక పోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌతాఫ్రికాలో రాహుల్ బ్రహ్మాండంగా ఆడాడు. వన్డే సిరీస్ ని గెలిపించాడు. తొలి టెస్ట్ మ్యాచ్ లో చేసిన సెంచరీ నభూతో నభవిష్యత్ అని అంతా కొనియాడారు.
మిడిల్ ఆర్డర్ లో 6వ నెంబర్ బ్యాటర్ గా వస్తున్న రాహుల్ కి టీ 20లో స్థానం ఇవ్వలేక వదిలేశారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయడానికి యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో తీసుకువద్దామంటే విరాట్ కొహ్లీ వచ్చాడు. తర్వాత స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా సంజూ శాంసన్ ఉన్నాడు. లేదంటే రింకూ సింగ్ ఉండనే ఉన్నాడు.
ఒకవేళ ఎంపికచేసిన తర్వాత 11మంది ఫైనల్ జట్టులో గానీ ఆడించకపోతే, అదింకా అవమానంగా ఉంటుంది. అందుకని ముందే సెలక్ట్ చేయలేదని అంటున్నారు. అయితే నిజంగానే ఇప్పుడు టీ20లకు రాహుల్ ను తీసుకోకపోతే, తనింక ఐపీఎల్ ఆడుకోవల్సిందేనని అంటున్నారు.
ఒకవేళ ఐపీఎల్ లో గానీ రాహుల్ ఇరగదీస్తే మాత్రం, తిరిగి టీ 20 ప్రపంచ కప్ లో చోటు దక్కుతుందని కొందరంటున్నారు. ఇప్పుడు తీసుకున్న జట్టులో కొందరిని బలవంతంగా జొప్పించినట్టుగా చెబుతున్నారు. ఇంతకీ ఆఫ్గాన్ టూర్ కి టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎవరంటే…
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కొహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉన్నారు.
ఇంత గొప్ప ఆటగాళ్లలో ఒక్కరిని తప్పించి రాహుల్ కి చోటు ఇవ్వలేకపోయారా ? అని నెట్టింట అభిమానులు మండిపడుతున్నారు.