Who is Manu Bhaker?: రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు గెలవడంతో మను బాకర్ పేరు దేశంలో మార్మోగిపోతోంది. 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ విభాగంలో ఆమె -సరబ్ జోత్ సింగ్ తో కలిసి కాంస్య పతకాన్ని గెలిచింది. ఒకే ఒలింపిక్ లో ఇలా రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా తను చరిత్ర సృష్టించింది. ఇంతకీ మను బాకర్ ఎవరు? ఇంత ఖరీదైన ఆటను ఎలా నేర్చుకున్నారనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి.
ఇక మను బాకర్ వ్యక్తిగత విషయానికి వస్తే, తను హర్యానా రాష్ట్రం జజ్జర్ జిల్లాలోని గోరియా గ్రామానికి చెందిన క్రీడాకారిణి. తండ్రి రామకిషన్ బాకర్.. నేవీలో చీఫ్ మెరైన్ ఇంజినీర్ గా , తల్లి సుమిధా బాకర్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే చిన్నతనం నుంచి కుమార్తె టాలెంట్ చూసిన తండ్రి షూటింగులో ఆమెకు శిక్షణ ఇప్పించారు. ఆ షూటింగ్ కిట్ కొనేందుకు ఆ రోజుల్లో రూ.1.50 లక్షలు ఆయన వెచ్చించారు. అంటే తన కుమార్తెపై ఆయనకంత నమ్మకం. దానిని ఏ దశలోనూ ఆమె వమ్ము చేయలేదు. ప్రతీ అడుగులోనూ ఎంతో కష్టపడింది. ఆ కష్టమే నేడు పారిస్ ఒలింపిక్సలో రెండు పతకాలు సాధించిపెట్టింది.
ఎంతో ఖరీదైన క్రీడ అయిన షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న మను బాకర్ సంపద విలువ రూ.12 కోట్లుగా ఉంటుందని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆమెకు ఒలింపిక్స్ మెడల్ ద్వారా వచ్చేదేమీ లేకపోయినా, ఇతర ఈవెంట్లలో గెలిచిన మొత్తం, కమర్షియల్ కమిట్మెంట్స్ తో సంపాదించింది చాలానే ఉందని చెబుతున్నారు.
Also Read: నేడు కాకపోతే రేపు.. అదే ‘ఖేలో ఇండియా’లక్ష్యం: కేంద్రమంత్రి
2018 యూత్ ఒలింపిక్స్ లో మను బాకర్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆ సమయంలో హర్యానా ప్రభుత్వం ఆమెకు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత కాలంలో ఆ సొమ్ములు ఆమెకు అందలేదు. దీంతో ఆమె ఒక సందర్భంలో అది కేవలం హామీ తప్ప తనకు దక్కిందేమీ లేదని ట్వీట్ చేసింది. అది అప్పట్లో వైరల్ అయింది. తర్వాత మరి వచ్చిందో లేదో తెలీదు.
కానీ, ఈసారి మాత్రం భారత ప్రభుత్వం తనకు పెద్ద మొత్తంలోనే ఇచ్చేలా ఉంది. డబుల్ బొనాంజా తప్పదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెండు మెడల్స్ గెలవడంతో ఆమె గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరూ మనుకి అభినందనలు చెబుతున్నారు. స్వీట్లు పంచిపెట్టుకున్నారు.
మను కంటే ముందు రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచారు. సింధు రెండు ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించింది. కానీ ఒకే ఒలింపిక్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా మను బాకర్ నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, క్రీడాశాఖా మంత్రి ఇలా ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు.