Captaincy: టీ20 కెప్టెన్సీగా హార్దిక్ పాండ్యాకు కాకుండా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు ఇవ్వడంపై సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్గా మంచి అనుభవం ఉన్నదని, గుజరాత్ టైటాన్స్ టీంను తొలి నుంచి నాయకత్వం వహించి రెండు సార్లు ఫైనల్కు తీసుకువచ్చాడని, టీమీండియాకు కూడా ఆయన సారథ్యం వహించారని వివరిస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఏం తప్పు చేశాడని ఆయనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. మాజీ టీమిండియా ప్లేయర్ మహమ్మద్ కైఫ్ ఈ ప్రశ్నలు వేశారు. టీ20 కెప్టెన్గా బాధ్యతలు అందుకోకపోవడానికి ఆయన ఏమీ తప్పు చేయలేదని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 27వ తేదీతో మొదలవుతున్న శ్రీలంక వైట్ బాల్ టూర్ టీమ్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను ఎంచుకుంది. గౌతం గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు ఈ టూర్తోనే మొదలవుతున్నాయి.
గత నెలలోనే టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత ఆ బాధ్యతలు హార్దిక్ పాండ్యానే చేపడతారని అందరూ అనుకున్నారు. జూన్ 29న టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ అయితే.. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే ఉన్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అనుకున్నారు. కానీ, గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్లు మాత్రం సూర్యకుమార్ యాదవ్కు ఆ అవకాశం ఇచ్చారు. 2026 టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
Also Read: మసాలా లేదని బాధపడవద్దు: కొహ్లీ, గంభీర్
కానీ, ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్వాగతించలేదు. రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహించారని, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్కు వైస్ కెప్టెన్గా ఉన్నారని వివరించారు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్లేయర్, నెంబర్ 1 టీ20 ప్లేయర్ అని ప్రశంసించారు. ఈ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. కానీ, బీసీసీఐ హార్దిక్ పాండ్యావైపు మొగ్గాల్సిందని, ఎందుకంటే కెప్టెన్సీ బాధ్యతలకు దూరమయ్యేంత తప్పులేమీ ఆయన చేశాడని తాను భావించడం లేదని అభిప్రాయపడ్డారు.